జార్ఖండ్ లోని ఖర్సావాన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న పికప్ వ్యాన్ బోల్తా పడింది. దీంతో వ్యాన్ లో ప్రయాణిస్తున్న ఏడుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కూలీలను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటన గురువారం ఉదయం జార్ఖండ్ లోని రాజ్నగర్ పీఎస్ పరిధిలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
అతివేగంగా కదులుతున్న వ్యాన్ ను లక్డా కొచ్చా మలుపు వద్ద తిప్పే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వ్యాను క్యాబిన్ పైన కూడా కూలీలు కూర్చున్నారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోవడం పట్ల సీఎం హేమంత్ సోరేన్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి ప్రభుత్వం తరఫున మెరుగైన చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ పికప్ వ్యాన్లో దాదాపు 30-35 మంది కూలీలు ఉన్నారు. కూలీలతో నిండిన ఈ వ్యాన్ వేగం ఎక్కువగా ఉండటంతో డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గాయపడిన వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని జమ్షెడ్ పూర్ లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు.
రాజ్ నగర్ లోని హంసాల్లో ఫౌండ్రీ పనిచేసేందుకు వీరంతా బయల్దేరినట్లు సమాచారం. కూలీలు పశ్చిమ సింగ్భూమ్లోని గలుబాసా, గాగ్రీ నివాసితులు. పికప్ వ్యాన్ డ్రైవర్ ఖర్సావాన్ నివాసి. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు గుర్తించారు.