ఇప్పటికే రైల్వే సంస్థ వందే భారత్ ట్రైన్స్ ను పట్టాలెక్కించింది. దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలను నడిపేందుకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఎనిమిది వందే భారత్ రైళ్లు ప్రయాణికలకు సేవలు అందిస్తున్నాయి. త్వరలో సికింద్రాబాద్ టు తిరుపతి రూట్ లో వందే భారత్ రైలు ప్రారంభం కానుంది.
ఆగష్టు 15 నాటికి 75 వందేభారత్ రైళ్లు, రాబోయే మూడు నాలుగేళ్లలో 400 వందే భారత్ రైళ్లు నడపాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇండియన్ రైల్వేస్ వందే భారత్ తరహాలోనే వందే మెట్రో సర్వీసులను కూడా తీసుకురాబోతుంది. నగరాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రయాణాలను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకి మినీ వెర్షనే.. ఈ వందే మెట్రో. ఈ ఏడాది చివరి నాటికి వందే మెట్రో డిజైన్, ప్రొడక్షన్ పూర్తి కానుంది. శివారు ప్రాంత ప్రజలను నగరాలతో కనెక్ట్ చేయడమే వందే మెట్రో సర్వీస్ లక్ష్యం. పెద్ద నగరాల చుట్టు పక్కల ప్రాంతాల్లో వందే మెట్రో సర్వీసులు తీసుకురానున్నారు.
నగరాలకు రాకపోకలను సులభతరం చేసేందుకే వందే మెట్రో. వందే మెట్రో రూట్ లో చిన్న స్టేషన్లు కవర్ కానున్నాయి. 60-70 కిలోమీటర్ల మధ్య ఉన్న పట్టణాల మధ్య ఈ వందే మెట్రో అందుబాటులోకి రానుంది. వీటి ఉత్పత్తికి సంబంధించి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.