జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మచిలీపట్నంలో జరిగే ఆవిర్భావ సభకు పవన్ కళ్యాణ్ వారాహి వాహనంలో వెళ్లనున్నారు. అయితే సభ నేపథ్యంలో రహదారులపై ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని కృష్ణా జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో పర్యటనలో స్పల్ప మార్పులు చేయడం జరిగింది.
అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి మొదలవుతున్నాయి. దీంతో ముందు అనుకున్న ప్రకారం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన యాత్రను మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభించడం లేదు. శాసన సభకు వచ్చే మంత్రులు, శాసన సభ్యులు, ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వారాహి యాత్ర ప్రారంభం అయ్యే స్థలాన్ని విజయవాడ ఆటోనగర్ కు మారుస్తున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు కళ్యాణ్ వారాహి వాహనంలో విజయవాడ ఆటోనగర్ నుంచి మచిలీపట్నం సభాస్థలికి బయలుదేరుతారు. ముందుగా ఎంపిక చేసిన అయిదు ప్రాంతాల్లో వారాహికి స్వాగతం పలకడం జరుగుతుంది. వారాహి వాహనానికి ఏమాత్రం అడ్డు రాకుండా జనసైనికులు పూర్తిగా సహకరించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో యాత్ర మార్పు స్థలాన్ని అనసైనికులు, వీర మహిళలు గమనించాలని నాదెండ్ల మనోహర్ కోరారు. సభా స్థలంలో లక్షా ఇరవై వేల మంది కూర్చునేందుకు వీలుగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. సభకు హాజరయ్యే జనసైనికులకు మజ్జిగ, మంచినీరు, స్నాక్స్ ఆహారం అందించే విధంగా 2 వేల మందితో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు.