విరసం నేత వరవరరావుకు బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 25న ఆయన సరెండర్ కావాలని స్పష్టం చేసింది. తన బెయిల్ను పొడిగించాలని వరవరరావు వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తనకు ఫిబ్రవరిలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయిందని.. దానివల్ల కుంటుంబానికి దూరంగా ఉంటున్నానని కోర్టుకు వివరించారాయన. 84 ఏళ్ల వయసులో కుటుంబానికి దూరంగా ఉండటం కష్టంగా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. పైగా తాను ఏ ఒక్క షరతును ఉల్లంఘించలేదని చెప్పారు.
తన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే కుటుంబం దగ్గరికి వెళ్లేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు వరవరరావు. వాదనలు విన్న కోర్టు 25న సరెండర్ కావాలని ఆదేశించింది. ఎల్గార్ పరిషత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావు.. నాలుగేళ్లుగా ముంబైలోనే ఉంటున్నారు. తెలంగాణ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది కోర్టు.
నక్సల్స్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో వరవరరావును 2018 నవంబర్ లో అరెస్ట్ చేశారు. అదే సంవత్సరం సోమ్ సేన్ తో సహా మరో ఐదుగురుని ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుణె జిల్లాలోని భీమా కోరెగావ్ లో 2018 జనవరి 1న హింస చెలరేగింది. 200 ఏళ్ల కింద జరిగిన భీమా కోరేగావ్ యుద్ధాన్ని స్మరించుకునేందుకు దళితులు చేసిన ప్రయత్నం అల్లర్లకు దారితీసింది. ఆ అల్లర్లలో ఒకరు మృతి చెందగా, పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు.