టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్ను పోలీసులు అవమానించడంపై ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సీరియస్ అయ్యారు. ఈ మేరకు డీజీపీకి ఆయన లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. రాష్ట్ర పోలీసుల్లో క్రమశిక్షణారాహిత్యం పెరిగిపోతోందన్నారు.
దీనికి చిత్తూరు జిల్లా నగరి సీఐ శ్రీనివాసంతి వ్యవహారశైలి నిదర్శనమని ఆయన తెలిపారు. యువతకు రోల్ మోడల్స్గా ఉండాల్సిన పోలీసులు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడటం శోచనీయమని పేర్కొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో సీఐ శ్రీనివాసంతి వాడిన అసభ్యకరమైన భాషను చూస్తుంటే అనాగరికులు కూడా తలదించుకునేలా ఉందని ఆయన మండిపడ్డారు.
నాగరికులు ఎవరూ అలాంటి భాష మాట్లాడరంటూ ఆయన మండిపడ్డారు. ఈ నెల 17న కోనసీమ జిల్లా, అనపర్తి, రామచంద్రాపురం పోలీసులు ఇలాంటిదే మరో ఘటనకు పాల్పడ్డారని చెప్పారు. చంద్రబాబు పర్యటనలో ఉన్న జవహర్ను పోలీసులు అరెస్టు చేసి నేలపై కూర్చోబెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టేషన్కు వచ్చిన ఇతర సందర్శకులను కుర్చీలపై కూర్చోబెట్టి జవహర్ను మాత్రం నేలపై కూర్చోబెట్టి అవమానించారని ఆయన ధ్వజమెత్తారు. జవహర్ దళితుడని తెలిసీ ఉద్దేశ పూర్వకంగానే పోలీసులు ఆయన పట్ల కులవివక్ష చూపారని ఆరోపించారు. అతని మొబైల్ ఫోను, పర్సును బలవంతంగా లాక్కున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న నగరి సీఐ శ్రీనివాసంతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జవహర్ను అవమానించిన రామచంద్రాపురం పోలీసు అధికారులపై ఎస్సీ అట్రాసిటీ యాక్టు సెక్షన్ 3 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.