తెలంగాణ పర్యటనలో భాగంగా ఓయూలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ సభకు వీసీ అనుమతి నిరాకరించింది. 2021 జూన్ 22న జరిగిన పాలక మండలి సమావేశంలో రాజకీయ, మతపరమైన సభలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారని, అందుకు రాహుల్ సభకు పర్మిషన్ ఇవ్వలేమని చెప్పింది.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వినతిని తిరస్కరిస్తున్నట్లు ఓయూ గవర్నింగ్ కౌన్సిల్ శనివారం ఓ ప్రకటన జారీ చేసింది. ఓయూలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, టెక్నికల్ స్టాఫ్ ఎంప్లాయిస్, ఓయూ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నికలు మే 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 5గంటల వరకు జరగనున్నాయని రిజిస్ట్రార్ ప్రకటనలో ప్రస్తావించారు.
ప్రస్తుతం ఎంబీఏ పరీక్షలు కొనసాగుతున్నాయని అన్నారు. మే 9 నుంచి పీజీ పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయని.. ఈ సభ కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలిగే అవకాశముందని తెలిపారు రిజిస్ట్రార్. యూనివర్సిటీకి చెందిన ఇతర స్టూడెంట్ ఆర్గనైజేషన్లు సైతం రాహుల్ పర్యటనపై అభ్యంతరాలు లేవనెత్తాయని వివరించారు.
ఓయూలో సభ జరిగితే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశముందని పేర్కొన్నారు. మే 7న ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో రాహుల్ గాంధీ సభకు అనుమతివ్వాలంటూ ఎన్ఎస్యూఐ సభ్యులైన మానవతా రాయ్, ప్రతాప్ రెడ్డి, జగన్నాథ్ యాదవ్, సూర చందన వీసీకి వినతిపత్రం ఇచ్చారు. దానిపై స్పందించిన వీసీ.. అనుమతిని నిరాకరించింది.