శివ భక్తులకు కోపం ముంచుకొచ్చింది. ఒంటి పై ఆ పరమేశ్వరుడి మాల ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. చుట్టు పక్కల ఉన్న శివమాలాధారులు అంతా ఒక్కటయ్యారు. పోలీస్ స్టేషన్ చేరుకొని వీరంగం సృష్టించారు. ఖాకీలకు చుక్కలు చూపించారు.
ఇంతకీ ఈ గొడవకు అసలు కారణమేంటీ..అంతాలా శివమాలాధారులకు కోపం కల్గించిన విషయం ఏంటీ.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం దేవనూరు గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ పెద్ద వివాదానికి దారి తీసింది. శివ మాల వేసిన వ్యక్తిపై మరో వ్యక్తి దాడి చేయడాన్ని నిరసిస్తూ శివ స్వాములు యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీనారాయణ పూర్ చౌరస్తా దగ్గరు మెరుపు ధర్నాకు దిగారు.
శివస్వాములపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న మాలధారులు.. రోడ్డుపై బైటాయించారు. మాలలో ఉన్న వ్యక్తి పై దాడికి నిరసిస్తూ.. పెద్ద ఎత్తన ఆందోళన చేప్టటారు. శివ స్వామిపై దాడి చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఉన్నాడని తెలుసుకున్న శివస్వాములు.. లక్ష్మీ నారాయణపూర్ నుంచి నేరుగా యాలాల పోలీస్ స్టేషన్ కు చేరుకుని.. వీరంగం సృష్టించారు.
దాడి చేసిన వ్యక్తిని కాకుండా మరో వ్యక్తిని చితక బాదారు. వీరిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిన సందీప్ గౌట్ అనే కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. శివ స్వాముల వీరంగం విషయం తెలుసుకున్న తాండూర్ రూరల్ సీఐ రాంబాబు.. తన సిబ్బందితో హుటాహుటిన యాలాల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.కాగా, ఈ విషయాన్ని సీరియస్ తీసుకున్న సీఐ రాంబాబు పోలీస్ స్టేషన్ లో దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు.
చిన్నపాటి గొడవ చిలికి చిలికి గాలి వానలా మారి ఇరువర్గాలు కేసులు పెట్టుకునే వరకూ వెళ్లింది. పోలీసు స్టేషన్ లో శివస్వాముల దాడి దృశ్యాలు.. అక్కడున్న సీసీ ఫుటేజీ లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో యాలాల పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.