దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేడారం సమ్మక్క జాతర తెలంగాణకే తలమానికం. అయితే.. మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీ.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది మేడారం జాతర సందర్బంగా వేములవాడ రాజన్న దర్శనార్థం విచ్చేసిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. మేడారం అమ్మవార్ల వద్దకు వచ్చే భక్తులు ముందుగా రాజన్న దర్శనానికి వస్తున్నారు. దీంతో దర్శనానికి గంటల కొద్ది క్యూలో నిలబడాల్సి వస్తోందని భక్తులు చెప్తున్నారు.
స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా.. పక్క రాష్ట్రాల నుంచి సైతం భక్తులు విచ్చేస్తున్నారు. ఈ క్రమంలో స్వామి వారిని దర్శించుకునేందుకు సుమారు 4 గంటల సమయం పడుతున్నట్లు భక్తులు తెలుపుతున్నారు.
అయితే.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు ఆలయంలో కఠినంగా అమలు చేస్తున్నారు అధికారులు.