హైదరాబాద్: తెలంగాణ జనం విష జ్వరాలతో అల్లాడుతుంటే అధికార టీఆర్ఎస్ పార్టీలో అధికారం కోసం అడ్డమైన రాజకీయం చేస్తున్నారని టీపీసీసీ క్యాంపేయిన్ కమిటీ చైర్పర్సన్ విజయశాంతి దుయ్యబట్టారు. ‘బంగారు తెలంగాణ చేసి చూపుతామని అధికారంలోకి వచ్చి కేసీఆర్ అండ్ కో ఏ రకంగా అధికార దాహంతో ప్రజల జీవితంతో ఆడుకుంటుందో ఇటీవల పరిణామాలు చూస్తే అర్థమవుతోంది’ అంటూ తెలంగాణ రాములమ్మ తీవ్రంగా మండిపడ్డారు. ఆమె తాజాగా చేసిన ప్రకటన ఇలా సాగింది.
‘రాష్ట్రమంతటా విషజ్వరాలు వ్యాపించాయి. జనం అల్లాడుతున్నారు. అధికార పార్టీలో మాత్రం గులాబీ జెండాకు బాస్ ఎవరు? అని ఓ వర్గం… కెసిఆర్ తప్ప గులాబీ జెండాకు బాస్ ఎవరు లేరని మరో వర్గం వాదించుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. అందరికంటే తనకు రాజకీయాల్లోనూ పాలనాపరంగా ముందుచూపు ఉందని ప్రకటించుకునే కెసిఆర్ గారు.. విష జ్వరాలతో ప్రజలు పడే బాధల విషయంలో మాత్రం ఎందుకు జాగ్రత్త చర్యలు తీసుకోలేదో జనానికి అంతుబట్టడం లేదు. ఆరోగ్య సమస్యలను కారణంగా చూపించి… తనను బలిపశువును చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు సన్నిహితులతో వాపోయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో డెంగ్యూ జ్వరాలు స్వైన్ ఫ్లూ వంటి జ్వరాలతో జనం ఆస్పత్రులలో బారులు తీరుతున్న ప్పటికీ.. ఆరోగ్య శాఖ మంత్రి మాత్రం దీనిని పెద్ద సీరియస్గా పరిగణించాల్సిన అవసరం లేదని పరిస్థితిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్య లోపం వల్లే విష జ్వరాలు ప్రబలుతున్నాయనే వాదన కూడా ఉంది. ఈ రోజు ఈటల రాజేందర్ గారు జిహెచ్ఎంసిలో సమావేశం నిర్వహించి… ఇదే అంశాన్ని ప్రస్తావించడం వెనుక కారణం కూడా లేకపోలేదు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కనుసన్నల్లోనే ఇప్పటికీ జిహెచ్ఎంసితో పాటు మున్సిపల్ వ్యవస్థ నడుస్తోంది అన్నది జగమెరిగిన సత్యం. ఒకవేళ ఈ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వివాదంలో తనను ఇరికించాలని అనుకుంటే పరోక్షంగా ఈ సమస్యను కేటీఆర్ గారి మెడకు చుట్టాలని ఈటల రాజేందర్ గారు భావిస్తున్నట్లు టిఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఓవైపు ఇంత బీభత్సం జరుగుతున్నా.. మాజీ మంత్రి హరీష్రావు గారు మాత్రం సందట్లో సడేమియా అన్న చందంగా… తన అనుచరులతో వెయ్యి కొబ్బరికాయలు కొట్టించి… తాను ముఖ్యమంత్రి అవ్వాలని మొక్కులు చెల్లిస్తూ… చాపకింద నీరులాగా పావులు కదుపుతున్న విషయం స్పష్టమైంది…’