హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేపదే సారు… కారు…. సర్కార్ అనే డైలాగ్ వాడటం వెనుక ఆంతర్యం ఏమిటో ఇప్పుడు అర్థం అయిందని తెలంగాణ రాములమ్మ విజయశాంతి విరుచుకుపడ్డారు. యాదాద్రిలో కేసీఆర్ చిహ్నాలు అమర్చుతున్న వైనంపై రాములమ్మ స్పందించారు. ‘ఎంతో పవిత్రమైన యాదగిరిగుట్టలో నిర్మిస్తున్న స్థూపాలలో దేవతామూర్తులతో పాటు కేసీఆర్ సార్ బొమ్మను.. కార్ గుర్తును.. టీఆర్ఎస్ సర్కార్ గుర్తును చెక్కడం ద్వారా కేసీఆర్ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారు అని అర్థం అవుతోంది. రాజులు, రాజ్యాలు కనుమరుగైన తర్వాత కూడా కేసీఆర్ తన దొరతనాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ప్రతిపక్షాలు ఈ విషయంపై చేసే ప్రకటనలను కేసీఆర్ రాజకీయ కోణంలో చూసి.. వాటిని లైట్గా తీసుకునే ప్రమాదం ఉంది. తిరుమలతో సమానంగా తెలంగాణలో యాదగిరిగుట్టను ఇక్కడి ప్రజలు ఎంతో పవిత్ర క్షేత్రంగా నమ్ముతారు. మరి అలాంటి పవిత్ర క్షేత్రాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకుంటూ.. ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తున్న నియంతృత్వ తీరుపై మఠాధిపతులు, పీఠాధిపతులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధర్మో రక్షతి రక్షితః అనే నానుడికి తగ్గట్లు హైందవ ధర్మాన్ని కాపాడే పెద్దలు టీఆర్ఎస్ పాలకులకు కనువిప్పు కలిగిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ విజయశాంతి ఒక ప్రకటన చేశారు.