ముఖ్యమంత్రి కేసీఆర్ను ట్విట్టర్ వేదికగా తూర్పారబడుతున్నారు బీజేపీ సీనియర్ నేత విజయశాంతి. రోజుకో అంశంతో ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా విద్యావంతుల విషయంలో కేసీఆర్ సర్కార్ ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు ఆమె.
తెలంగాణలో ఆ బంధు… ఈ బంధు అంటూ ఎన్నికలప్పుడు లేనిపోని హడావుడి చేసే కేసీఆర్.. విద్యావంతుల పాలిట రాబందులా మారారని విజయశాంతి విరుచుకుడ్డారు. ఇటీవల మీడియాలో గణాంకాలతో సహా బయటికొచ్చిన కథనాలే అందుకు సాక్ష్యమని అన్నారు. ‘పట్టణ ప్రగతి – సర్వే ఆఫ్ స్ట్రీట్ వెండార్స్’ యాప్లో వీధి వ్యాపారుల కేటగిరీలో నమోదైన వివరాలు గమనిస్తే గుండె చెరువయ్యే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని ఆమె గుర్తు చేశారు.ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో దాదాపు 60 వేలమందికి పైగా విద్యావంతులైన యువతరం మరో మార్గం లేక స్ట్రీట్ వెండార్లుగా మారి తోపుడు బండ్లతో రోడ్ల మీదికి వచ్చారని ఆరోపించారు. ఇందులో పీజీలు చేసినవారు, టెక్నికల్ కోర్సులు పూర్తి చేసినవారు, కరోనా ప్రభావం వల్ల ఉద్యోగాలు కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులు…. ఇలా ఎందరెందరో కన్నీటి ధారలతో కనిపిస్తున్నారని చెప్పారు.
ప్రధానమంత్రి స్వనిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించిన రూ.10 వేల రుణమే వీరికి కాస్తో కూస్తో ఊరట కాగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారిని వీధిన పడేయటం తప్ప చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. నోటిఫికేషన్లు రావు… ఉద్యోగాల్లేవు… నిరుద్యోగభృతి లేదు… ఆశనిరాశల మధ్య నిరుద్యోగల ఆత్మహత్యలు ఆగడం లేదని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు.