- మహా సంక్షోభంపై విజయశాంతి సెటైర్లు
శివసేన పార్టీలో చోటు చేసుకున్న తిరుగుబాటు పరిణామం ఎంత మాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదన్నారు బీజేపీ నేత విజయశాంతి. సీఎం ఉద్ధవ్ నాయకత్వంలోని శివసేనలో రెబెల్ ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతుందని చెప్పారు. సిద్ధాంతాలని బలిపెట్టి, అధికారం కోసం అర్రులు చాస్తే అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగులుతుందని ఈ సంక్షోభం రుజువు చేసిందని అన్నారు.
లోక కల్యాణానికి మూలమైన హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని ఉద్ధవ్ తండ్రి బాల్ ఠాక్రే శివసేన పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. పొత్తులు, సంకీర్ణ సర్కార్లపై బాల్ ఠాక్రే గతంలో స్పందిస్తూ ఏ పార్టీకి మెజారిటీ ఉందో ఆ పార్టీ మాత్రమే సంకీర్ణ సర్కార్ కు నేతృత్వం వహించాలని స్పష్టంగా చెప్పారని వివరించారు. ఉద్ధవ్ అవన్నీ తుంగలో తొక్కి, కేవలం అధికారం కోసం తండ్రి వ్యతిరేకించిన పార్టీలతోనే చేతులు కలిపి శివసేనని మలినం చేశారని ఆరోపించారు.
చిరకాల మిత్రుడిగా ఉంటూ వచ్చిన బీజేపీని ఉద్ధవ్ దూరం చేసుకున్నారని… చివరికిప్పుడు సొంత పార్టీవారే తిరుగుబాటు చెయ్యగా దిక్కులేక సీఎం పీఠాన్ని వదులుకునేందుకు సిద్ధపడాల్సి వచ్చిందని సెటైర్లు వేశారు. ఉద్ధవ్ కి ఇంతకంటే అవమానం మరొకటి ఉండదన్నారు విజయశాంతి.
కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ఉండటం ఎంత ప్రమాదకరమో చివరికి ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలు గ్రహించినా.. ఉద్ధవ్ మేలుకోకపోవడం ఈ పరిస్థితులకి దారితీసిందని చెప్పారు.