విజయశాంతి, బీజేపీ సీనియర్ నేత
ధాన్యం కొనుగోళ్ళపై ఢిల్లీలో చేసిన డ్రామా తుస్సుమనగానే పరుగు పరుగున హైదరాబాద్ తిరిగొచ్చిన కేసీఆర్… హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుందంటూ రైతులకి ఏదో గొప్ప ఉపకారం చేస్తున్నట్టు బిల్డప్ ప్రకటన చేశారు. నిజానికి ఇది ఆయన గతంలోనే చెప్పి మాట తప్పిన వ్యవహారం తప్ప మరేమీ కాదు. కేసీఆర్ ప్రకటనలోని వాస్తవాన్ని గమనిస్తే… రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే ఈ బియ్యాన్ని రా రైస్ గా కేంద్రానికే ఇవ్వాలి తప్ప మరో మార్గం కచ్చితంగా లేదు.
సేకరించిన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పారా బాయిల్డ్ రైస్ గా మార్చి దానినేమైనా విదేశాలకు ఎగుమతి చెయ్యగలరా అంటే ఆ అవకాశాలు కూడా లేవు. రా రైస్ ఎంతిచ్చినా తీసుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. మిల్లర్ల నుంచి కమిషన్ కోసం మాత్రమే కేసీఆర్ పారా బాయిల్డ్ జపం చేస్తున్నారని గతంలో నేను పదే పదే చెప్పాను. యాసంగి వడ్లలో నూకల శాతం ఎక్కువ అవుతుందంటున్న కేసీఆర్, ఆ నష్ట భారాన్ని ఎందుకని కేంద్రంపై వెయ్యాలనుకుంటున్నారు? ఇందుకు ఆహార భద్రతను సాకుగా చెబుతారా? ఆ బాధ్యత మీకు లేదా?
రైతు బాంధవుడని, ధనిక రాష్ట్రమని చెప్పుకుంటూ ఈ బాధ్యత నుంచి ఎందుకు తప్పించుకోవాలనుకుంటున్నారు. తన తాజా నిర్ణయంతో వచ్చే సుమారు 700 కోట్ల నష్టాన్ని అంచనా వేసేందుకు నిపుణుల కమిటీ వేస్తామంటున్నారు. పారా బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ మాత్రమే పంపిస్తామని కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ సర్కార్.. అందుకు భిన్నంగా వితండవాదం చేసి, చివరికిప్పుడు మొదటికొచ్చింది.
దీన్నిబట్టి చూస్తుంటే.. అంతా చేసే అవకాశం ఉండీ.. కేంద్రాన్ని బద్నాం చెయ్యడానికే ఈ మాటలు అంటున్నారు. సీఎం ప్రెస్ మీట్ పెట్టారంటే సహనం కోల్పోయి విపక్షాలపై బురద జల్లడానికేనని ప్రజలందరికీ తెలుసు.