విజయశాంతి, బీజేపీ సీనియర్ నేత
ఏ సమస్యకైనా చిత్తశుద్ధితో శాశ్వత పరిష్కారాలు చూపించడానికి బదులు.. కంటితుడుపు చర్యలతో తాత్కాలిక ఊరట కలిగించి తర్వాత గాలికొదిలేయడంలో ఈ పాలకులు సిద్ధహస్తులు. ఇందుకు నిలువెత్తు ఉదాహరణే రైతు బంధు సమితులు. ప్రస్తుతం వీటికి పట్టిన గతిపై మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే తెలంగాణ సర్కార్ తీరును ప్రజలందరూ అసహ్యించుకోవడం ఖాయం. రేయింబవళ్లు కష్టపడి రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర, గిట్టుబాటు ధర దక్కేలా… వారి ఆదాయం పెంచేలా… పక్క రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేసుకునేలా రైతుబంధు సమితులు అన్నదాతలకు అండగా ఉంటాయని గొప్ప కబుర్లు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వీటిని ప్రారంభించింది. అంతే కాదు.. పంటల బీమా గురించి అవగాహన కల్పించడం, వ్యవసాయోత్పత్తుల నిల్వ, గ్రేడింగ్, ప్యాకింగ్ లకు సహకారం, ట్రేడింగ్ సెంటర్ల ఏర్పాటు.. ఆహార పార్కులు, పరిశోధనలు, రైతులకు విజ్ఞానయాత్రలంటూ ఇంకా ఎన్నెన్నో చెప్పింది. నేడు రైతు బంధు సమితుల పరిస్థితి చూస్తే.. ఒక్క అడుగు ముందుకు పడితే ఒట్టు. వాటిని ప్రారంభించినప్పుడు కేసీఆర్ చెప్పిన రూ.200 కోట్ల కార్పస్ ఫండ్, పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు ఉద్దేశించిన రూ.500 కోట్ల ఎమ్మెస్పీ ఫండ్ అతీగతీ లేదు. అంతెందుకు… 1.61 లక్షల మంది సభ్యులున్నట్టు చెబుతున్న ఈ సమితుల్లో నాలుగేళ్లుగా ఏ ఒక్కపనీ నడవకపోగా అద్దె, కరెంట్, టెలిఫోన్ బిల్స్ చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర కార్యాలయం ఉండటం ఇక్కడి ఘోరమైన పరిస్థితికి అద్దం పడుతోంది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రైతు వేదికలు దాదాపు నిరుపయోగంగా పడి ఉన్నాయి. రాష్ట్ర కమిటీ విషయానికి వస్తే చైర్మన్ తప్ప కమిటీ సభ్యులు కానరాని నిస్సహాయ పరిస్థితి వెక్కిరిస్తోంది. ఆర్భాటంగా మొదలుపెట్టిన ఈ రైతు బంధు సమితుల మార్గంలోనే రేపు దళిత బంధును కూడా తీసుకెళతారనడంలో ఎలాంటి సందేహం లేదు.