తాము తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చగలమంటూ ఎంఐఎం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి ఘాటుగా స్పందించారు. అది టీఆర్ఎస్, ఎంఐఎం మ్యాచ్ ఫిక్సింగ్తో ఓటర్లను దోఖా చేసే కుట్ర అంటూ కొట్టిపారేశారు. ఎంఐఎం ఏడుగురి ఎమ్మెల్యేలతో ప్రభుత్వానికి అవసరం లేదు, రాదు అన్న విజయశాంతి.. మతకలహాలు సృష్టించి ప్రభుత్వాన్ని కూలదోస్తామని ఎంఐఎం చెబుతున్నట్టా అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు అయ్యాక.. టీఆర్ఎస్-ఎంఐఎంలు అవసరమైతే పొత్తు పెట్టుకొని తీరతాయని ఆమె అభిప్రాయపడ్డారు. అవసరం లేకున్నా కలిసే ఉంటాయని చెప్పుకొచ్చారు. ఆ రెండూ పార్టీలూ వీడదీయలేని సయామీ ట్విన్స్ అంటూ పొల్చారు.
బీహార్లో ఆర్జేడీ- కాంగ్రెస్ ఓటమికి కూడా టీఆర్ఎస్-ఎంఐఎం కుట్ర చేశాయని ఆరోపించారు విజయశాంతి. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిని ఓడగొడితే దేశవ్యాప్తంగా మైనార్టీలు ఇక కాంగ్రెస్ గెలవదు అన్న అభిప్రాయానికి వస్తారని.. ఫలితంగా ఇతర రాష్ట్రాలలో పట్టు ఏర్పరుచుకుని, పొత్తుల ద్వారా దేశమంతా వ్యాప్తి చెందాలనే ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించారు. అందుకు అవసరమైన నిధులను కూడా టీఆర్ఎస్ అందించినట్లు రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయని విజయశాంతి అన్నారు. కానీ ఆ ఫలితాలతో తెలంగాణలోని మొత్తం మైనార్టీలు టీఆర్ఎస్ – ఎంఐఎంలకు కూడా దూరమయ్యే సంకేతాలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. దాని నుంచి బయటపడేందుకే కేసీఆర్ ఎంఐఎంతో కలసి చర్చించి, తిరిగి మైనార్టీల నమ్మకం పొందగలిగే ఎత్తుగడలో భాగంగా దేశవ్యాప్త నేతలతో సమావేశాలు, మోడీపై యుద్ధం లాంటి నిష్ఫలమైన ప్రసంగాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గతంలో వీరి ఫెడరల్ ఫ్రంట్ విన్యాసాలు అందరూ చూసినవేనంటూ ఎద్దేవా చేశారు.