రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన అంటూ తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్లోని లోపాలతో రాష్ట్రంలోని ప్రజలు… ముఖ్యంగా రైతులు గుండెలు బాదుకుంటున్నారని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. కానీ అంతకంటే షాకిచ్చే మరి కొన్ని అంశాలు మీడియా కథనం ద్వారా తాజాగా బయటికొచ్చాయి. రాష్ట్ర సర్కారు దివాలాకోరు పనితీరును బయటపెట్టాయని మండిపడ్డారు.
అదేమిటంటే… “తెలంగాణ రైతుల భూరికార్డుల నిర్వహణ వ్యవస్థ మొత్తాన్ని దివాళా బాటపట్టిన టెర్రాసిస్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ చేతుల్లో కేసీఆర్ సర్కారు పెట్టింది. ఈ టెర్రాసిస్ గతంలో బ్యాంకులకు వేల కోట్ల అప్పులు ఎగ్గొట్టినట్టు ఆరోపణలున్న ఐఎల్ఎఫ్ఎస్ చేతుల్లో ఉండేది. అయితే టెర్రాసిస్ లో సగానికి పైగా వాటాను ఫిలిప్పీన్స్ కు చెందిన ఫాల్కన్ గ్రూప్ కు ఐఎల్ఎఫ్ఎస్ అమ్మేసింది. దీంతో తెలంగాణ భూముల రికార్డులన్నీ విదేశీ కంపెనీ చేతిలోకి వెళ్లినట్లయింది. దాదాపు 70 లక్షల మంది రైతులకు చెందిన సుమారు కోటిన్నర ఎకరాల భూముల రికార్డులు.. ప్రభుత్వ.. ఎండోమెంట్.. వక్ఫ్.. అటవీ శాఖలకు చెందిన మరో కోటి ఎకరాల భూముల సమాచారం ఆర్థికంగా దివాళా తీసిన ఓ కంపెనీ చేతిలో పడింది. ఇప్పుడు ఆ భూముల డేటా భద్రత ప్రశ్నార్థకంగా మారింది” అని విజయశాంతి మండిపడ్డారు. ఈ డేటాపై సైబర్ దాడులు జరిగి హ్యాక్ అయితే పరిస్థితి ఏంటి…? అని ప్రశ్నించారు.
ఏవైనా సమస్యలు తలెత్తితే.. అప్పుడు ఏకైక ఆధారమైన మాన్యువల్ రికార్డులను పరిరక్షించే చర్యల్ని కూడా సర్కారు చేపట్టడం లేదని విమర్శించారు విజయశాంతి. “తెలంగాణలో ప్రజల ఆస్తులైన సర్కారు భూములు.. రైతుల భూముల డేటా భద్రత విషయంలో ఇంత దారుణమైన నిర్లక్ష్యాన్ని తెలంగాణ సర్కారు ప్రదర్శిస్తోంది. పైగా ఇందుకు సంబంధించిన సమాచారం అడిగిన కార్యకర్తలకు సైతం సరైన జవాబు ఇచ్చే దిక్కు లేకుండా పోయింది. భూముల ప్రక్షాళన పేరిట రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్న ఈ సర్కారును నిలదీయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది” అని చెప్పారు విజయశాంతి.