ప్రస్తుతం తెలంగాణలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే.. సరిగ్గా 19 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు క్యాబినెట్ను విస్తరించిన తర్వాత తలెత్తిన అసమ్మతి గుర్తుకు వస్తోందంటున్నారు అంటున్నారు తెలంగాణ ‘రాములమ్మ’ విజయశాంతి.
అప్పటి వరకు తనకు తిరుగే లేదనుకున్న చంద్రబాబుకు అప్పట్లో జరిగిన క్యాబినెట్ విస్తరణ తర్వాత గడ్డు రోజులు మొదలయ్యాయి. తనకు మంత్రి పదవి దక్కక పోవడంతో కేసీఆర్ తిరుగుబాటు చేయడం, చివరకు అది టీడీపీ ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చిన వైనాన్ని ఎవరూ మర్చిపోలేరు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు చూస్తున్న వారందరికీ కూడా, గతంలో చంద్రబాబుకి ఎదురైన అనుభవమే ఇప్పుడు కేసీఆర్కి కూడా ఎదురు అవుతుందన్న అభిప్రాయం కలుగుతోంది. మొదటినుంచి టీఆర్ఎస్ను అంటిపెట్టుకున్న తమను విస్మరించారు అన్న అసమ్మతి ఓవైపు… పదవుల కోసం పార్టీ మారిన తమను పట్టించుకోలేదన్న అసహనం మరోవైపు.. మొత్తంమీద కేసీఆర్ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. నా మాటే శాసనం అనుకున్న కేసీఆర్కి వ్యతిరేకంగా ధిక్కార స్వరాలను వినిపించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆపార్టీ నేతలు ఏమాత్రం వెనకాడటం లేదు. అసమ్మతి గళం వినిపిస్తున్న నేతలను బెదిరించి… వారితో తనకు మద్దతుగా ప్రకటనలు చేయించుకుంటూ కేసీఆర్ సంక్షోభ నివారణకు ప్రయత్నాలు చేయవచ్చు కానీ.. రోజురోజుకు పెరిగే అసంతృప్తిని అడ్డుకోవడం ఆయన తరం కాదు. టీఆర్ఎస్లో వినిపిస్తున్న నిరసన గళాన్ని చూస్తూ ఉంటే.. గతంలో మాదిరిగా కేసీఆర్ పేరు చెబితే భయపడే రోజులు పోయాయనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. తను కనుసైగ చేస్తే వణికిపోయే పరిస్థితి నుంచి.. తనకు వ్యతిరేకంగా మాట్లాడే స్థాయికి టీఆర్ఎస్లో అసమ్మతి వర్గం పెరుగుతోంది అంటే.. దాని వెనక ఉన్న అదృశ్య శక్తి ఏమిటో కేసీఆర్కి ఈపాటికే అర్ధం అయివుంటుంది. కాంగ్రెస్, టీడీపీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి, సంబరపడిన గులాబీ బాస్కు ఇప్పుడు అదే అనుభవం బీజేపీ రూపంలో పునరావృతం అవుతుంది అన్న వాదన వినిపిస్తోంది. రోజువారి పరిణామాలు కూడా ఈ వాదాన్ని బలపరిచే విధంగానే ఉన్నాయి.