రోడ్డు కోసం ఓ గ్రామానికి చెందిన గ్రామస్తులు రోడ్డెక్కారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ పల్లి గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో.. స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏళ్లుగా రోడ్డు కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు.
దీంతో విసిగిపోయిన గ్రామస్తులు షాద్ నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమ గ్రామానికి బీటీ రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా గ్రామస్తులు వెనక్కి తగ్గలేదు.
పోలీసులు వారిని పక్కకు లాగే ప్రయత్నం చేయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మూడు వేల మంది ఓటర్లున్నా తమ ఊరికి ఇప్పటివరకూ ఎందుకు బీటీ రోడ్డు వేయలేదని గ్రామస్తులు ప్రశ్నించారు.
ఎమ్మెల్యే వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి రోడ్డు వేయకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు గ్రామస్తులు.