రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీ తోపాటు.. ఇతర ప్రతిపక్షపార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్ధి గెలుపు ఖాయం అనే వార్తలు వినిపిస్తుండగా.. స్వతంత్ర అభ్యర్ధులు సైతం దేశ ప్రథమ పౌరుడి పదవి కోసం పోటీ పడేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా.. ఉత్తర్ప్రదేశ్ లోని వారణాసికి చెందిన వినోద్ యాదవ్ అనే వ్యక్తి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు.
రాష్ట్రపతి ఎన్నికలకు జూన్ 25న నామినేషన్ వేసేందుకు శివుని వేషదారణలో ఉన్న వ్యక్తిని వెంటబెట్టుకుని ఎడ్లబండి మీద ఢిల్లీకి బయల్దేరారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేందుకు తనకు తగిన మద్దతు ఉందని అంటున్నారు వినోద్ యాదవ్. గతంలోనూ వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ రాష్ట్ర మంత్రి రవీంద్ర జైశ్వాల్పై పోటీ చేశానని వినోద్ యాదవ్ తెలిపారు.
వినోద్ యాదవ్ ఇప్పటివరకు తొమ్మిది ఎన్నికల్లో పోటీచేశారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికలకు పోటీ చేయబోతున్నారు. పోటీ చేసిన ప్రతి ఎన్నికలోనూ వినోద్ యాదవ్ ఓటమిపాలయ్యారు. ఈ సందర్భంగా వినోద్ యాదవ్ మాట్లాడుతూ.. శివుడు కలలోకి వచ్చాడని.. గతంలో నరేంద్ర మోడీని ప్రధానిని చేసేందుకు గుజరాత్ నుంచి ఢిల్లీకి పంపిందే నేనే నని చెప్పాడన్నారు వినోద్.
అలాగే నువ్వు కూడా యూపీ నుంచి ఢిల్లీ వెళ్లు.. కచ్చితంగా రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుస్తావని శివుడు కలలో చెప్పాడంటున్నారు. చాలా రాష్ట్రాల ఎంపీల మద్దతు తనకు ఉందంటున్నారు. ఈ నెల 25న నామినేషన్ వేసిన తర్వాత ప్రధాని మోడీ, ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్లను కలిసి మద్దతు కోరుతానంటున్నారు వినోద్ యాదవ్.