గత పది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం ఏ సందు చూసిన సముద్రాన్ని తలపిస్తోంది. ప్రజలు నివసించే ప్రదేశాల్లోనే కాకుండా తాజాగా జంతువులకు నిలయం అయిన జూ పార్క్లోనికి కూడా నీరు చేరడంతో ప్రస్తుతానికి పార్కును మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
జంతువులన్ని ఎన్క్లోజర్లో సురక్షితంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. జంతువులకు ఎలాంటి ప్రమాదం లేదని వారు స్పష్టం చేశారు. జూపార్కుకు అనుకుని మీర్ అలం చెరువు ఉండడం వల్ల.. దాని ఔట్ ఫ్లో ఒకటి సఫారీ పార్క్ గుండా మూసిలోకీ వెళ్తుంది.
ఒకపక్క వరద నీరు.. మరోపక్క మీర్ అలం చెరువు ఔట్ ఫ్లో నీరు ఒక్కసారిగా రావడంతో సఫారీ పార్కులో భారీగా నీళ్లు చేరినట్లు అధికారులు తెలిపారు. సపారీకి వేళ్లే దారులలో ప్రమాదకర స్థాయిలో నీరు చేరడంతో పార్కును మూసివేసినట్లు పేర్కొన్నారు. నీరు పూర్తిగా తగ్గిన తరువాత సఫారీ పార్క్ను తిరిగి తెరుస్తామని పేర్కొన్నారు.
పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.జూపార్క్లోకి భారీగా చేరిన వరదపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, అధికారులతో మంత్రి తలసాని ఫోన్లో మాట్లాడారు. నెహ్రూ పార్క్లో చేరిన వరదను తరలించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సిబ్బందిని పంపించి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.