తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏల ఆందోళన తారాస్థాయికి చేరింది. సోమవారం 78వ రోజు సందర్భంగా ఎమ్మార్వో ఆఫీసులకు తాళాలు వేసి నిరసనలు తెలిపారు. పేస్కేల్, వారసత్వ ఉద్యోగాల కోసం తెలంగాణ వ్యాప్తంగా 22 వేల మంది వీఆర్ఏలు నిరసనల్లో పాల్గొంటున్నారు. తమ ఉద్యోగాలు ఉంటాయో, ఊడుతాయో తెలీడం లేదని వాపోతున్నారు. ఇంకోవైపు గత మూడు నెలలుగా తమకు జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబాలు పూట గడవడం కూడా కష్టంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీఆర్ఏలు. ఆర్థిక ఇబ్బందుల్లో ఇళ్లు, పొలాలు, స్థలాలు, పెద్దల ఆస్తులన్నీ తాకట్టు పెడుతున్నా తమ కష్టాలు తీరడం లేదంటున్నారు. చాలా మంది పూట గడవని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు చేయమని అడుగుతున్నామే తప్ప.. మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదని ఈ సందర్భంగా వీఆర్ఏలు గుర్తు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో వీఆర్ఏలు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో వీఆర్ఏల ఆందోళనలు కొనసాగుతున్నాయి. శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 78రోజులు ఆందోళన చేసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే నిజామాబాద్ జిల్లా బోధన్ లో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు వీఆర్ఏలు. తహసీల్దార్ కార్యాలయం గేటుకు తాళం వేశారు. నిరసన చేపట్టి 78 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం 23 వేల మంది వీఆర్ఏలు సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. అయినా సర్కార్ స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ తహశీల్దార్ కార్యాలయాన్ని వీఆర్ఏలు ముట్టడించారు. కార్యాలయం ప్రధాన గేటు ముందు బైఠాయించి అధికారులు, సిబ్బంది లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది 78 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పేస్కేల్ అమలు చేయాలని.. విద్యార్హతలను బట్టి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సంగారెడ్డి జిల్లాలో వీఆర్ఏల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పఠాన్ చెరు మండలంలోని తహసీల్దారు ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. అధికారులు లోపలికి వెళ్లకుండా.. గేటు ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని.. లేకుంటే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి సిద్ధమవుతామని వీఆర్ఏలు ప్రకటించారు.