దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. వన్డే సిరీస్ కు భారత జట్టు ఆటగాడు దీపక్ చాహర్ దూరమయ్యాడు. ఇప్పటికే గాయంతో తొలి వన్డేకు చాహర్ దూరం కాగా, తాజాగా పూర్తి వన్డే సిరిస్ కు దూరమైనట్టు బీసీసీఐ తెలిపింది.
చాహర్ స్థానంలో మరో ఆటగాడు వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. దక్షిణాఫ్రికాతో తొలి వన్డేకు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా దీపక్ కాలు చీలమండకు గాయమైంది. దీంతో అతను సిరీస్ కు దూరమయ్యాడు.
భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 9న జార్ఖండ్ రాజధాని రాంచీ వేదికగా రెండో వన్డే జరగనుంది. అనంతరం ఈ నెల 11న డిల్లీ వేదికగా చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే టీ 20 వరల్డ్ కప్ కోసం చాహర్ ను స్టాండ్ బై ప్లేయర్గా ఎంపిక చేశారు.
వెన్నుగాయంతో ఫాస్ట్ బౌలర్ బుమ్రా వరల్డ్కప్ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో దీపక్ చాహర్ను ఎంపిక చేయాలనే సూచనలు వచ్చాయి. కానీ తాజాగా దీపక్ చాహర్ కూడా గాయంతో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ప్రపంచకప్లో భాగంగా తొలి మ్యాచ్ లో ఈ నెల 23న పాక్ తో భారత్ జట్టు తలపడనుంది. అప్పటి వరకు చాహల్ కోలుకోవడం అనుమానంగానే కనిపిస్తున్నది.