తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు సంక్రాంతి పండుగ వేళ సంచలన ప్రకటన చేశారు. ఒక వైపు రాజకీయాలు వేడెక్కుతుంటే.. తన రాజకీయాలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు నేను నా కుమారుడు హితేష్ స్వస్తి చెబుతున్నా..ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మేము ఇమడ లేమని వెల్లడించారు.
అయితే దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి భర్త. అలాగే మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి తోడల్లుడు. డబ్బుతో నడిచే రాజకీయాలు.. మనస్సు చంపుకొని చేయలేము.. ప్రజా సేవ చేయాలనుకుంటే పదవులు లేకున్నా సొంతంగా చేస్తామన్నారు వెంకటేశ్వర రావు. ఇప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు లేవన్నారు. అయితే దగ్గుబాటి వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.
తాను ,తన కుమారుడు హితేష్ రాజకీయాలకు స్వస్తి చెబుతున్నామని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రకటించడం పై ఇంకా ఎవరూ స్పందించలేదు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ వేదిక పై ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శనివారం ఆయన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకొల్లుతో తనకున్న అనుబంధంతో ఇక్కడ మనసులోని మాట చెప్పానని వివరించారు. డబ్బుతో రాజకీయం, కక్ష సాధింపులకు దిగడం తమ కుటుంబానికి అలవాటు లేదన్నారు. గతంలో రాజకీయాలకు నేటీకీ పొంతన లేదని.. అందుకే హితేష్, తాను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగుతున్నామని ఆయన తెలిపారు. అయితే ఆయన సతీమణి పురందేశ్వరి బీజేపీలో కొనసాగుతున్నారు.