గ్రేటర్ హైదరాబాద్ లో జనావాసాల మధ్య ఉన్న గోదాములను మరో చోటకు తరలిస్తామని, జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు.
మరో రెండు రోజుల్లో భవనం కూల్చివేత పనులు పూర్తవుతాయని చెప్పారు. బల్డింగ్ పరిసరాల్లోని ఇండ్లకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కూల్చివేయించామని తెలిపారు. గోదాముల యజయానులు నిబంధనలు, జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరుచుగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు.
కాగా సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్ పేట డెక్కన్ నైట్ వేర్ లో అగ్ని ప్రమాదానికి గురైన భవనాన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. ఆధునిక సాంకేతికత ఉపయోగించి భవనం కూల్చివేస్తామని అధికారులు చెప్పారు. ఈ భవన కూల్చివేతకు రోబోటిక్ టెక్నాలజీని వాడారు జీహెచ్ఎంసీ అధికారులు.
చుట్టపక్కల ఇళ్ళకు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా చర్యలు తీసుకున్నారు అధికారులు. భవనం లోపల 10వేల టన్నులు వ్యర్థాలను క్రేన్ల సాయంతో ముందు భాగం నుంచి తొలగించారు. ఇక ఈ మాల్ కూల్చివేయడానికి అయ్యే ఖర్చు యజమానుల వద్ద వసూలు చేస్తామని జీహెఎచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
అయితే గత శనివారం భవనంలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. ఫస్ట్ ఫ్లోర్ లో పూర్తిగా కాలిన ఓ వ్యక్తి అస్థి పంజరం లభ్యమైంది. దుకాణం సిబ్బందిలో ఒకరు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం జరిగిన రోజు ముగ్గురు సిబ్బంది కనిపించకుండా పోయారు. మంటల సమయంలో ముగ్గురు లోపలికి వెళ్లారని ఇతర సిబ్బంది తెలిపారు. దుకాణంలో ఉన్న తమ వస్తువులు తెచ్చుకునేందుకు వెళ్లారని చెబుతున్నారు.