బీజేపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు రైతులను ఉగ్రవాదులతో పోల్చి మాట్లాడటం సిగ్గు చేటని మండిపడ్డారు. రెచ్చగొట్టేలా మాట్లాడటం వల్లే ఎంపీ అరవింద్ ను రైతులు అడ్డుకొని తన్ని తరిమేశారని అన్నారు. బీజేపీయే అసలైన ఉగ్రవాద సంస్థ అని జీవన్ రెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లేకుండా చేయాలని సీఎం కేసీఆర్ కఠినచర్యలు తీసుకుంటున్నారని జీవన్రెడ్డి తెలిపారు. బీజేపీ గంజాయి తోట అయితే.. నేతలు మొక్కలను అని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలోని బీజేపీ నేతలను గంజాయి మొక్కల్లా ఏరిపారేస్తామని వ్యాఖ్యానించారు. ఇకపై రాష్ట్రంలో గంజాయి ఉండదు. బండి సంజయ్ కూడా ఉండరని చెప్పారు జీవన్ రెడ్డి.
ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ వేషాలు వేసుకుని ప్రజలను మోసం చేయడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని జీవన్రెడ్డి అన్నారు. గతంలో ఎర్రజొన్న రైతులతో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు దిక్కలేకుండా పోయిందని అన్నారు. రైతులపై బుల్లెట్ల వర్షం కురిపించిన చంద్రబాబు అడ్రస్ గల్లంతైందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రైతులను తీవ్రవాదులంటూ మాట్లడుతున్న బీజేపీ నేతలకు కూడా అదే పరిస్థితి వస్తుందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమకు ఆదేశాలు వస్తే బీజేపీ నేతలు ఒక్కరు కూడా రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు. తెలంగాణను నిలబెట్టేది కేసీఆర్.. చెడగొట్టేది బీజేపీ అని పేర్కొన్నారు జీవన్ రెడ్డి.