ఈ ఏడాదిలో 46 శాతం అధిక వర్ష పాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. సీజన్ ఉన్న 4 నెలల్లో జూలైలో అత్యధిక వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 7 శాతం అధిక వర్షాలు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. క్యాలెండర్ ఇయర్ ప్రకారం నిన్నటితో వర్షకాలం ముగిసినట్లే. ఇక నుంచి వర్షాలు కురవడం తగ్గిపోవడమే కాకుండా.. పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి.
సాధారణంగా రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈ సారి మాత్రం మూడ్రోజుల ముందుగానే కేరళను తాకాయి. అనుకున్న సమయాని కంటే ముందుగా రుతుపవనాలు కేరళకు వచ్చినా.. తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం ఆలస్యంగానే తాకాయి. ఈసారి వానాకాలంలో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయన్న అధికారుల అంచనాలు నిజమయ్యాయి.
ఇక క్యాలెండర్ ఇయర్ ప్రకారం వర్షాకాలం సీజన్ జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. ఈ ఏడాది జూన్ లో 9 శాతం ఎక్కువ వర్షపాతం నమోదవ్వగా, జులైలో ఏకంగా 145 శాతం, ఆగష్టులో 20 శాతం, సెప్టెంబర్ లో 35 శాతం అధిక వర్షాలు కురిశాయని వెదర్ డిపార్ట్ మెంట్ పేర్కొంది. మొత్తానికి ఈ సీజన్ లో కురవాల్సిన వర్షాల కన్నా 46 శాతం అధిక వర్షాలు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే 7 శాతం ఎక్కువేనని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న వెల్లడించారు.
కాగా సీజన్ మొత్తంలో 7 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాల ప్రభావం తెలంగాణపైన స్ట్రాంగ్ గా ఉండటం కారణంగానే ఈ ఏడాది అధికారుల అంచనాలు రీచ్ అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 10 జిల్లాల్లో అత్యధిక వర్షపాతాలు నమోదవ్వగా 19 జిల్లాల్లో అధిక వర్షాలు పడ్డాయి. 4 జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 91 శాతం, కుమ్రంభీమ్ లో 84 శాతం, ములుగులో 80 శాతం, నిర్మల్ లో 81 శాతం, మంచిర్యాలలో 70 శాతం అధికవర్షాలు పడ్డాయని వెదర్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది.
అక్టోబర్ 1 నుంచి వర్షాలు కురవడం తగ్గుతాయని.. అలాగే పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేసినట్లు వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈ మాన్ సూన్ సీజన్ లో రుతుపవనాలు యాక్టివ్ గా ఉంటూ అధిక వర్షాలు కురిశాయి. సూర్యాపేటలో అతితక్కువగా 8 శాతం వర్షపాతం నమోదయ్యిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి.