ఈ ఏడాది వేసవి కాలం ప్రారంభం నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక విలవిలలాడిపోతున్నారు. ఎండల తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి ప్రజలు జంకుతున్నారు. భానుడి భగభగలతో భాగ్యనగరంలోని రోడ్లు బోసిపోతున్నాయి.
భానుడి ఉగ్రరూపానికి రోజురోజుకు ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరుగుతున్నాయి. సోమవారం హైదరాబాద్లో గరిష్టంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత.. కనిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. రోజుకు సగటున 41.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి నగరంలో ఎండల తీవ్రత ఎక్కువగానే కనిపిస్తోంది.
ఇక రాష్ట్రంలో పరిశీలిస్తే.. ఆదిలాబాద్ జిల్లాలో 43.3 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లాలో 42.2, రామగుండంలో 41.4, హనుమకొండలో41, మహబూబ్నగర్లో 40.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారులు రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఈ రెండు రోజులు 41 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అయితే, రాబోయే నాలుగు రోజల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల 48 గంటల్లో హైదరాబాద్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రజలకు ఉక్కబోత నుంచి ఊరట లభించనుంది.