తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. గత కొంతకాలంగా సాధారణంగానే ఉన్న ఉష్ణోగ్రతలు ప్రస్తుతం పడిపోతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజులుగా చలి తీవ్రత పెరిగిపోతోంది. కాగా 11వ తేదీ వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పలు ప్రాంతాల్లో పది డిగ్రీలు కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని చెబుతున్నారు.
కొన్ని ప్రాంతాల్లో దాదాపు సున్నా డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదుకు అవకాశం ఉందని అంటున్నారు. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, ఉత్తరాంధ్రలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా అక్కడక్కడ వర్షాలు కూడా పడే అవకాశం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని రాయసీమ ప్రాంతంలోని దక్షిణ భాగంలో కూడా మేఘావృతమై ఉంటుందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా బంగాళాఖాతంలో దక్షిణ భాగాల్లో చల్లటి వాతావరణం చలిగాలులు ఎక్కువగా వీస్తాయని తెలిపారు. అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. మరో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్ లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదే విధంగా ఏపీ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో దాదాపు సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
ఇక ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొమ్రంభీం, భద్రాద్రి జిల్లాలో తీవ్రత అధికంగా ఉంది. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్, హైదరాబాద్ పరిసరాలు, నాగర్ కర్నూలు, వరంగల్ ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది. కరోనా కోరలు చాస్తున్న తరుణంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని.. సీజనల్ వ్యాధులకు గురి కాకుండా ప్రజలు జాగ్రత్త పాటించాలన్నారు.