తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా గవర్నర్ ప్రసంగం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తూ.. తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారిందన్నారు.
రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో మార్పు కనిపిస్తోందన్నారు. తెలంగాణ అభివృద్ధి దేశానికి రోల్ మోడల్ అన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం నెంబర్ వన్ గా దూసుకెళ్తుందన్నారు. ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తున్నామన్నారు. నేతన్నకు ప్రభుత్వం 5 లక్షల బీమా సదుపాయం కల్పించిందన్నారు.
కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ కింద 1.16 లక్షలు అందజేస్తోందన్నారు. ఇప్పటి వరకు 12 లక్షల మందికి కల్యాణ లక్ష్మీ పథకాన్ని లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేసిందన్నారు. మా ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించిందన్నారు. తెలంగాణ గ్రామాలలో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే ధృడ నిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు.
మూడున్నరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందన్నారు. 65 వేల కోట్ల పంట పెట్టుబడి ఇచ్చామన్నారు. తెలంగాణ ఎన్నో విజయాలు సొంతం చేసుకుందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో సీఎం, ప్రజాప్రతినిధుల కృషి ఎంతో ఉందని గవర్నర్ అన్నారు. కాగా కేంద్రంపై ఎలాంటి విమర్శలు లేకుండా తెలంగాణ సర్కార్ గవర్నర్ ప్రసంగాన్ని రూపొందించడం కొసమెరుపు.