ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇక ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులే ఈ ఎన్నికల్లో కీలక పాత్రను పోషించబోతున్నాయనడంలో ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. ఎన్నికల నగారా మోగే వరకు ఎవరు.. ఏ పార్టీలోకి జంప్ అవుతారో ఎవరికి తెలియదు. మరి ఇలాంటి పరిస్థితుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కట్టె విరుగొద్దు.. పాము చావొద్దన్నట్టుగా ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాజకీయంగా మా మనుగడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అని స్పష్టం చేస్తూనే…నేను ఆ స్టేట్ మెంట్ ఇచ్చానంటే నా భర్త దయాసాగర్ కూడా దానికి కట్టుబడే ఉంటారన్నారు. అయితే అలా కాకుండా నా భర్త దయాసాగర్ పార్టీ మారతాను నువ్వు నాతో రా అంటే.. ఎంత రాజకీయనాయకురాలినైనా భర్తతో పాటు వెళ్లాల్సిందేగా..అందుకే నా భర్త పార్టీ మారితే నేనూ వెళ్తానని వ్యాఖ్యానించారు.
నా భర్త ఒక పార్టీలో, నేను మరొక పార్టీలో.. మా పిల్లలు మరొక పార్టీలో ఉండరని ఆమె కుండబద్దలు కొట్టారు. రాజకీయాల్లో మనగలిగిన కాలమంతా సీఎం వైఎస్ జగన్ రెడ్డితోనే ఉండాలనుకున్నామని గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత.
అయితే ఏపీలో తిరుగులేని విజయం సాధించి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత.. ఆయన తొలి కేబినెట్ లో మేకతోటి సుచరిత హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కానీ, వైఎస్ జగన్ రెండో కేబినెట్ లో మాత్రం ఆమెకు మళ్లీ అవకాశం దక్కలేదు. ఆ తర్వాత సుచరితకు మంత్రివర్గంలో కొనసాగించాలంటూ ఆమె అనుచరులు ఆందోళనకు దిగడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతే కాదు మంత్రి పదవి రాకపోవడం,అలకబూనిన ఆమె.. ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే కేబినెట్ నుంచి మార్చిన తర్వాత ఆమెకు గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ బాధ్యతల్ని కట్టబెట్టారు జగన్.
అప్పుడు ఆమె తాను వైసీపీలోనే ఉంటానని.. జగన్ తోనే ప్రయాణం అని ప్రకటించారు. ఇప్పుడు రాజకీయాలపై ఆమె చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. మరి ఆమె పార్టీ మారడానికి రంగాన్ని సిద్ధం చేసుకున్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.