అదానీ ఇష్యూలో బీఆర్ఎస్ బీజేపీ పై విరుచుకుపడుతోంది. తాజాగా అదానీ కంపెనీల్లో ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ ఐసీ పెట్టిన పెట్టుబడుల విలువ 11 శాతం మేర పడిపోవడంతో ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
అదానీ వ్యవహారంతో ప్రజల పెట్టుబడులు పెట్టిన ఎల్ ఐసీ డబ్బులు ఆవిరవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ఆమె ప్రశ్నించారు. ప్రజల డబ్బులతో ఆటలాడటం ఏంటని ధ్వజమెత్తారు. ఎల్ ఐసీ పెట్టుబడులు పెట్టిన మధ్య తరగతి ప్రజలకు మోదీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు.
ఇంత పెద్ద స్కాం జరిగి దాదాపు 12 లక్షల కోట్లు నష్టపోయినా సీబీఐ, ఈడీ రిజర్వ్ బ్యాంకు వంటి సంస్థలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే సంస్థలేనా అని నిలదీశారు.
హిండెన్ బర్గ్ నివేదిక బహిర్గతం అయినప్పటి నుంచి అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉందని గుర్తు చేశారు. అప్పుడే కేంద్రం జేపీసీ ఏర్పాటు చేస్తే ప్రజలు మరింత నష్టపోయేవారు కాదని తెలిపారు.