చైనాలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా కేసుల డేటాను చైనా సరిగా వెల్లడించడం లేదంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో చైనాకు డబ్ల్యూహెచ్ఓ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా కేసుల గురించి ఎప్పటికప్పుడు నిర్ధిష్టమైన సమాచారాన్ని అందించాలని సూచించింది. కరోనా మృతుల సంఖ్య, జీనోమ్ సీక్వెన్సింగ్, వ్యాక్సిన్ డేటాను పంచుకోవాలని చైనాను డబ్ల్యూహెచ్ఓ ఆదేశించింది.
చైనాలో జీరో కోవిడ్ పాలసీని ఎత్తి వేసిన తర్వాత ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. డ్రాగన్ కంట్రీలో ప్రతి రోజూ లక్షలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. దీంతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని వార్తలు వస్తున్నాయి.
కానీ చైనా చెబుతున్న లెక్కలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న క్రమంలో తక్కువ పరీక్షలు చేస్తుండటంతో అధికారిక కేసుల గణాంకాలు నమ్మదగినవి కావని ప్రపచం ఆరోగ్య సంస్థ పేర్కొనది.
వైరల్ సీక్వెన్సింగ్ డేటాను జనవరి 3న జరగనున్న డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా బృందం సమావేశంలో సమర్పించాలని చైనా శాస్త్రవేత్తలను కోరింది. చైనాలో మహమ్మారి నియంత్రణ, అధిక రిస్క్ ఉన్న వ్యక్తులకు వ్యాక్సినేషన్పై చర్యలు చేపట్టాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ సూచించారు.