భారతీయుల ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోంది. టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగంలో మనదేశ ప్రతిభ వెలిగిపోతోంది. ఐటీలో మేటిగా ఎదిగిన భారత్.. మేలిమి నిపుణులకు అడ్డాగా మారుతోంది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్వర్క్స్ వంటి ప్రపంచ స్థాయి టాప్ కంపెనీల సీఈఓలుగా భారత సంతతి వ్యక్తులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పరాగ్ అగర్వాల్ చేరారు. ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సోమవారం ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ఆ స్థానంలో నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆయన ఆ కంపెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ)గా ఉన్నారు.
భారత్ నుంచి వచ్చిన వ్యక్తులు టెక్ ప్రపంచంలో రాణించడం ఆనందంగా ఉందని.. భారతీయుల ప్రతిభను ప్రశంసిస్తూ.. ఆర్థిక సేవల సంస్థలకు.. అలాగే వలసదారులకు అమెరికా కల్పిస్తున్న అవకాశాలకు.. ఇది నిదర్శనమని స్ట్రైప్ సీఈఓ పాట్రిక్ కొలిసన్ ట్వీట్ చేశారు. కొలిసన్ ట్వీట్కు బిలియనీర్ టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ స్పందించారు. భారతీయుల ప్రతిభ నుంచి అమెరికా భారీగా లబ్ధి పొందుతోంది అని వ్యాఖ్యానించారు. కొలిసన్ లాంటి వ్యక్తి భారతీయుల ప్రతిభను గుర్తించి.. దాన్ని బహిరంగంగా వ్యక్తపరచడం విశేషం అని పేర్కొన్నారు. భారతీయుల టాలెంట్పై గతంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సైతం పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు.
ప్రపంచంలో టాప్ 500 కంపెనీల సీఈఓల్లో పరాగ్ అగర్వాలే అత్యంత పిన్న వయస్కుడని తెలుస్తోంది. మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, పరాగ్.. ఇద్దరిదీ ఒకే వయసని బ్లూమ్ బర్గ్ పేర్కొంది. అయితే భద్రతా కారణాల రీత్యా వీరి పుట్టిన తేదీలను బహిర్గతం చేయలేదు. కానీ, జుకర్ బర్గ్ కంటే కూడా పరాగ్ చిన్నవాడని బ్లూమ్ బర్గ్ తమకున్న సమాచారం మేరకు విశ్లేషించింది. టాప్ 500 కంపెనీల సీఈఓల సగటు వయసు 58. ప్రముఖ మధుపరి, బెర్క్ షైర్ హాత్వే అధిపతి వారెన్ బఫెట్(90) అత్యంత పెద్ద వయసు సీఈఓగా కొనసాగుతున్నారు.