చాలామందికి నిత్య జీవితంలో ఆహారంతో పాటు వైన్ కూడా భాగం అయినట్టుంది. సాయంత్రం అయితే చాలు సుక్క గొంతులో పడనిదే ముద్ద దిగదు అన్నట్టుగా తయారయ్యింది మందుబాబులకు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడి ప్రభుత్వం సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో కొత్త వైన్ పాలసీని ప్రవేశ పెట్టింది. రాష్ట్రంలో తయారు చేసిన వైన్ లను విక్రయించడానికి అన్ని సూపర్ మార్కెట్ లకు, వాక్ ఇన్ స్టోర్ లను గురువారం అనుమతించినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరిగింది. వారం క్రితం మధ్యప్రదేశ్ లోని అన్ని విమానాశ్రయాలలో మద్యం అమ్మకాలకు అనుమతించినట్టు తెలిపారు. నాలుగు ప్రధాన నగరాల్లో ఎంపిక చేసిన సూపర్ మార్కెట్ లకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే.. సంవత్సరానికి రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే వారికి హోమ్ బార్ లైసెన్స్ లను జారీ చేయడానికి అనుమతించింది ప్రభుత్వం.
దేశంలో వైన్ పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. దాని విలువ దాదాపు రూ. 1,000 కోట్లకు చేరింది. ఈ రంగంలో అగ్రగామి మహారాష్ట్ర, ఆదాయానికి దాదాపు మూడింట రెండు వంతులు ఈ రంగం నుంచే వస్తోంది. దీనిపై బీజేపీ ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. విమానాశ్రయాల్లో వైన్ అమ్మకాలు దారుణం అని విమర్శించారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇతరులు కూడా విమర్శిస్తున్నారని అన్నారు.
మద్యం పరిశ్రమపై ప్రభుత్వం ప్రత్యేక ప్రేమ చూపుతోందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రాపూర్ లో నిషేధాన్ని ఎత్తివేయడానికి తీసుకున్న నిర్ణయాల మాదిరిగానే.. దిగుమతి చేసుకున్న మద్యంపై ఎక్సైజ్ సుంకాన్ని 300 నుంచి తగ్గించడం వంటి నిర్ణయాలకు ప్రభుత్వం యోచన చేస్తోందని అన్నారు. మేము మహారాష్ట్రను మద్య-రాష్ట్రంగా మార్చడానికి అనుమతించమని ఫడ్నవీస్ అన్నారు.
దీనిపై ప్రభుత్వం స్పందించింది. వైన్ ల తయారీకి సరఫరా చేసే ద్రాక్ష రైతులకు ప్రయోజనం చేకూరుతోందని పేర్కొంది. రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని, వైన్ పరిశ్రమ పెంచుతోందని అభిప్రాయపడింది. హార్డ్ లిక్కర్ తో పోలిస్తే చాలా వైన్ లలో ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుందని.. అనేక రెస్టారెంట్లు, బేకరీలు కొన్ని ఆహార తయారీ ప్రక్రియలలో వైన్ ను ఉపయోగిస్తాయని అధికారులు తెలిపారు.