జీవితమే ఒక నాటకరంగం అన్నాడో కవి. జీవించడం కోసం ఏదో ఒక సందర్భంలో అందరూ నటించాల్సిందే. కానీ ఎదుటివారిని మోసం చేయడం కోసం జీవితాంతం నటించడమే పనిగా పెట్టుకుంటే ఏదో ఒక రోజు లోకానికి అడ్డంగా దొరకాల్సిందే. ఇటలీలో అలాంటి ఒక ఉదంతమే జరిగింది.
గవర్నమెంట్ నుంచి వచ్చే పింఛను డబ్బుల కోసం ఓ మహిళ అంధురాలిగా నటించింది. ఒకట్రెండు రోజులు కాదండోయ్.. ఏకంగా 15 ఏళ్ల పాటు అంధురాలిగా నాటకమాడి అధికారులను బోల్తా కొట్టించింది. కానీ ఓ చిన్న పొరపాటుతో పట్టుబడాల్సి వచ్చింది.
48 ఏళ్ల ఆ మహిళ తాను అంధురాలినంటూ 15 ఏళ్ల క్రితం వైద్యుడి నుంచి ధ్రువీకరణ పత్రం పొందింది. అనంతరం పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంది. దాంతో ఆమె నిజంగానే అంధురాలు అని నమ్మిన అధికారులు పింఛను మంజూరు చేశారు.
మొత్తంగా 15 ఏళ్లలో ప్రభుత్వం నుంచి 2,08,000 యూరోలు అంటే భారత కరెన్సీలో రూ. 1.8 కోట్లు పింఛన్ రూపంలో కొల్లగొట్టింది. కానీ.. ఓ రోజు ఆమె తన సెల్ ఫోన్ను స్క్రోల్ చేయడం, పేపర్స్పై సంతకాలు పెట్టడాన్ని అధికారులు గమనించారు.
దీంతో ఆమె బండారం బయటపడింది. ఆమెపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఆమెకు అంధురాలిగా ధ్రువీకరణ పత్రం ఇచ్చిన వైద్యుడినీ విచారించనున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే, ఇటలీలోని ప్రధాన చట్ట అమలు సంస్థల్లో ఒకటైన కారాబినీరీ ఆమె టచ్స్క్రీన్ స్మార్ట్ఫోన్ను ఉపయోగించడం, పత్రాలపై ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతకం చేయడం చూసినప్పుడు ఆమె పట్టుబడింది. ఆమె వైకల్యాన్ని అనేకసార్లు ధృవీకరించిన ఇద్దరు వైద్యులను కూడా విచారిస్తున్నారు.