ప్రపంచంలోనే అతి పెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు హైదరాబాద్ వేదిక కానుంది. త్వరలోనే నగరంలో శంషాబాద్ సమీపంలో సుమారు 50 నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ ట్రేడ్ సెంటర్ ను నిర్మించనున్నట్లు ఓ ప్రముఖ సంస్థ తెలిపింది. దీని నిర్మాణ పనులు 2025లో ప్రారంభం కానున్నాయి.
ఇప్పటి వరకు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ పరిధిలోని నోయిడాలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ విస్తీర్ణం పరంగా 44 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇదే అతి పెద్దది. రెండో స్థానంలో 43 ఎకరాల్లో బీజింగ్ డబ్ల్యూటీసీ ఉంది.
అయితే శంషాబాద్లో నిర్మించనున్న వరల్డ్ ట్రేడ్ సెంటర్లో కేవలం 12 అంతస్తుల ఎత్తుకే పరిమితం కానుంది. ఇందులో స్కైస్క్రాపర్లకు అనుమతి కూడా లేదు. ఎందుకంటే ఇది విమానాశ్రయానికి దగ్గర ఉండటమే కారణం.
దీనిని నిర్మించడం కోసం దాదాపు రూ.4000 కోట్ల వరకు ఖర్చు పెట్టనున్నారు. దీనికి అనుబంధంగా సర్వీస్ అపార్ట్మెంట్లతో పాటు 225 గదుల హోటల్ నిర్మాణం కూడా చేయనున్నారు. మొత్తంగా వివిధ దశల్లో కలిపి 2035 నాటికి దీని పనులు పూర్తి కావచ్చని నిపుణుల అంచనా. ఇప్పటికే దీని నిర్మాణం కోసం 15 ఎకరాల స్థల సేకరణ పూర్తవగా నిర్మాణ పనులు తొలి దశలో ఉన్నాయి. మిగిలిన భూసేకణ పనులు జరుగుతున్నాయి.
శంషాబాద్తో డబ్ల్యూటీసీ పనులు చేపడుతున్న సంస్థనే విశాఖపట్నంలోనూ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తోంది. రిషికొండ సమీపంలో 20 లక్షల చదరపు అడుగుల సామర్థ్యంతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి ప్లాన్ రెడీ చేశారు.