తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడల్లా మీరు ఎంతమందిని తీసుకువస్తారు? అంటూ మంత్రిని ప్రశ్నించారు. చాలామందిని తీసుకుని రావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ మంత్రి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈవో గీతారెడ్డి వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన మంత్రి.. ‘అందరూ అయిపోయారు.. అందరూ అయిపోయారు’ అంటూ సమాధానం చెబుతూ ముందుకు నడిచారు. ఈ సమయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పక్కనే, ఆలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి కూడా ఉండడం గమనార్హం.
మార్చి 18వ తేదీన ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఉదయం కుటుంబసమేతంగా ఆలయానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు.