హైదరాబాద్లో జరుగుతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరైన సంగతి తెలిసిందే. ఈ బిజెపి పెద్దలకు తెలంగాణ వంటకాలు చేసేందుకు హైదరాబాద్ వచ్చిన యాదమ్మ బృందాన్ని నోవెటాల్ హోటల్లోకి అనుమతించలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తనపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్ని యాదమ్మ ఖండించారు. కొందరు కావాలని ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆమె బాధపడ్డారు.
తనను నోవెటాల్ లోకి రానివ్వలేదని కొందరు మూర్ఖులు దుష్ప్రచారం చేశారని యాదమ్మ మండిపడ్డారు. కొందరు సోషల్ మీడియా యువకులు కింద కూర్చోమని చెప్పి ఫోటో తీశారని, తనకు వాళ్ళ దుర్బుద్ధి అర్థం కాలేదని యాదమ్మ చెప్పారు.
తాను నోవెటాల్ దగ్గరకు రాగానే బండి సంజయ్ కారు పంపి తనను వెంటనే లోపలికి తీసుకెళ్లి గొప్పగా చూసుకున్నారని యాదమ్మ తెలిపారు. లోపలికి వెళ్ళగానే ప్రధాని మోడీతో కలిసి భోజనం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ అవకాశం దక్కడం జీవితం లో మరిచిపోలేనని యాదమ్మ వెల్లడించారు.
ప్రధాని సహా దేశంలోని మహామహులకు వండిపట్టే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని యాదమ్మ వెల్లడించారు. ఈ సందర్భంగా యాదమ్మ బృందంపై సోషల్ మీడియాలో వస్తున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని యాదమ్మ తెలిపారు.