నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి అఖండ విజయాన్ని అందుకున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుండి.. వైసీపీ అభ్యర్ధి ప్రత్యర్థులపై పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించి చివరకు విజయం సాధించారు.
మొత్తంగా 20 రౌండ్లు లెక్కింపు కొనసాగగా.. ప్రతి రౌండ్ లోనూ విక్రమ్ రెడ్డి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగారు. మొదటినుండి ఆధిపత్యంతో ముందుకు దూసుకుపోయిన వైసీపీ.. 15 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి పోలైన మొత్తం ఓట్లలో 50 శాతానికిపైగా 76,096 ఓట్లు దక్కించుకున్నారు.
అప్పటికే విజయం ఏకపక్షమని తేలిపోవడంతో పార్టీ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే.. పోస్టల్ బ్యాలెట్ సహా 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత.. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ పై 82,888 ఓట్ల మెజారిటీతో విక్రమ్ రెడ్డి గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు.
దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.. మరణంతో ఖాళీ అయిన ఆత్మకూర్ నియోజకవర్గ స్థానంలో ఈ నెల 23న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. అయితే.. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,13,338 కాగా.. అందులో 64 శాతం ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. అంటే కేవలం 1,37,081 మంది మాత్రమే ఓటు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.