రుణానుబంధ రూపేణ..!
పశుపత్ని సుతాలయాః !! అని పెద్దల మాట. అంటే పశువులు, భార్యాపిల్లలు, ఇళ్ళువాకిళ్ళు వంటివి రుణానుబంధ రూపంగా వచ్చి రుణము తీరాకా మనల్ని వదిలి వెళ్ళిపోతాయని అర్థం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడున్న బంధాలన్నీ గతజన్మ రుణానుబంధాలన్నమాట. లేకపోతే 15 ఏళ్ల క్రితం పాముకాటుతో చనిపోయాడనుకున్న కొడుకు ఎందుకు బతికివస్తాడు.!?
ఈ విచిత్ర ఘటన బిహార్లో జరిగింది. ఆ యువకుడిని చూసేందుకు ఊరంతా వరుసకట్టారు.అతని పేరు అంగేశ్ యాదవ్. తండ్రి పేరు రామ్సుమర్ యాదవ్. వీరు భాగల్పుర్ జిల్లాలోని మురసో గ్రామంలో నివాసం ఉంటున్నారు. అయితే అంగేశ్కు 10 ఏళ్లు ఉన్నప్పుడు పాము కరిచింది. ఆ సమయంలో అతడు నురగలు కక్కాడు.
దీంతో అతడికి భూతవైద్యం చేయించారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అంగేశ్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో అంగేశ్ను ఓ అరటి కాండంలో చుట్టి.. సరయూ నదిలో వదిలిపెట్టారు కుటుంబ సభ్యులు. తీరా చూస్తే.. 15 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమయ్యాడు అంగేశ్.
“పాము కరిచినప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. స్పృహ వచ్చిన తరువాత నేను అమన్ మాలి అనే వ్యక్తి దగ్గర ఉన్నట్లు తెలిసింది. ఆయన నన్ను బతికించారు. నన్ను పెంచిందీ ఆయనే. అమన్ మాలి పాములాడించే వ్యక్తి. ఆయనతో పాటే నేను చాలా ప్రాంతాలు తిరిగేవాడిని.
కటీహార్లో కొద్ది రోజులు ఉన్నాను. ఆ తరువాత అమన్తో కలిసి పంజాబ్లోని అమృత్సర్ వెళ్లాను. అక్కడ కొన్ని రోజులు ఓ వ్యవసాయదారుని వద్ద పనిచేశాను” అంగేశ్ తెలిపాడు.
అమృత్సర్లో ఉన్నప్పుడు తన గతం గురించి ఓ లారీ డ్రైవర్కు చెప్పాడు అంగేశ్. అతడు అంగేశ్ను ఉత్తర్ప్రదేశ్లోని ఆజంగఢ్కు తీసుకువచ్చాడు. అక్కడ మరికొంత మందికి తన ఊరు గురించి, ఊర్లో గుర్తున్న వ్యక్తుల పేర్లు చెప్పాడు. వారిలో ఒకరు అంగేశ్ ఫొటో తీసి మురసో గ్రామంలో తెలిసిన వారికి పంపించారు. అంగేశ్ సైతం తన కుటుంబ సభ్యులను కలిసేందుకు.. మనియార్ పోలీసులను సంప్రదించాడు. తన గురించి పోలీసులకు వివరంగా చెప్పాడు.
చివరకు అంగేశ్ గురించి అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. పోలీసు స్టేషన్కు చేరుకున్న తల్లిని ఇతర కుటుంబ సభ్యులను.. అంగేశ్ గుర్తుపట్టాడు.
తానే అంగేశ్ అని నిరూపించుకునేందుకు.. ఊర్లోని మరికొందరి పేర్లు, తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల పేర్లను చెప్పాడు. దీంతో అతనే అంగేశ్ అని నిర్ధారించుకున్న పోలీసులు.. అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.