వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన దగ్గర నుంచీ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూనే ఉంటున్నారు వైఎస్ షర్మిల. అందులోనూ మునుగోడు ఉప ఎన్నిక ప్రకటించిన తర్వాత ఆమె ప్రజా ప్రస్థానం పాదయాత్ర మొదలు పెట్టారు. ఈ యాత్రలో భాగంగా షర్మిల సీఎం కేసీఆర్ పై ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
తాజాగా షర్మిల మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రజా పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడే బయటకు వస్తారని అన్నారు. కేసీఆర్ ఎన్నికల్లో గెలిచాక ప్రజల ముఖం కూడా చూడరని వ్యాఖ్యానించారు షర్మిల.
ఇప్పటికైనా ప్రజలు ఓటు వేసేముందు ఆలోచించుకోవాలని ఆమె కోరారు. మంబోజీ పల్లి దగ్గర షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు వైఎస్ షర్మిలను కలిశారు. ఫ్యాక్టరీని మూసేయడంతో రోడ్డున పడ్డామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని షర్మిలకు వినతి పత్రం అందించారు. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 170వ రోజుకు చేరింది.
ఇందులో భాగంగా ఇవాళ నర్సాపూర్ నియోజకవర్గంలో కుల్చారం మండలం పోతంశెట్ పల్లి గ్రామంలో పాదయాత్ర మొదలు పెట్టారు. అక్కడి నుంచి మెదక్ నియోజకవర్గంలోని మాచవరం, మంబోజిపల్లి మీదుగా సాగుతోంది. సాయంత్రం మెదక్ పట్టణంలో స్థానిక రాందాస్ చౌరస్తాలో జరిగే బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు.