తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు, అమరుల కుటుంబాలకు గౌవరం లేకుండా పోయిందని విమర్శించారు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం తాళ్లపెంటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రైతు గోస దీక్షలో పాల్గొన్న షర్మిల.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
తెలంగాణలో ఆత్మగౌరవం ఎక్కడుందని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గం ప్రజలు ఆనందంగా ఉన్నారో చెప్పాలని నిలదీశారు. రైతులను దొంగలుగా సృష్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబంలో మాత్రమే ఐదు ఉద్యోగాలచ్చాయన్నారు.
డిగ్రీలు, పీజీలు చేసిన వారు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరవీరులు కలలు కన్న తెలంగాణను సాధించేందుకు పోరాటం చేద్దామని షర్మిల పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరులకు నివాళులర్పించారు షర్మిల.
ఉద్యమానికి ఊపిరిలూదిన మేధావులకు, ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులకు, ప్రాణత్యాగం చేసిన అమరులకు, గజ్జెకట్టి, గొంతు విప్పిన కళాకారులకు, కవితలు, పాటలతో ఉరకలెత్తించిన కవులకు, కలంతో ఉద్యమాన్ని వెలుగెత్తి చాటిన పాత్రికేయులకు షర్మిల రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు షర్మిల.