ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా పిట్లం మండలం కేంద్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. వైఎస్ షర్మిలకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో సమస్యలు లేని గ్రామం.. సమస్యలు లేని వర్గం లేదని సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు షర్మిల. కేసీఆర్ ఎప్పుడు బయటకు వచ్చినా ఓట్ల కోసమే వస్తాడు. మీ ఓట్లతోనే కేసీఆర్కి పని. మంచి మంచి మాటలు చెప్పడం, ఓట్లు గుద్దించుకోవడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు షర్మిల.
కేసీఆర్ ఆగడాలు 8 ఏళ్లుగా సాగాయి అంటే.. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యమే అన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నించి ఉంటే.. కేసీఆర్ అరాచకాలు సాగేవి కాదన్నారు. ఈ సారి కేసీఆర్కి కర్రు కాల్చి వాతలు పెట్టాలని దూయబట్టారు షర్మిల. ప్రజలకు సమస్యలు లేవని పాలకులు బుకాయిస్తున్నారు. సమస్యలు ఉన్నాయని నేను పాదయాత్ర చేస్తూ ఎత్తి చూపిస్తున్నానన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకు వస్తానని.. వైఎస్సార్ ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తానన్నారు షర్మిల. వచ్చే ఎన్నికలలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అన్ని సమస్యలు పరిష్కరిస్తుందన్నారు. తొలి సంతకం నిరుద్యోగుల భృతి పైనే పెడతానని చెప్పారు.
ప్రతి వర్గాన్ని 8 ఏళ్లుగా కేసీఆర్ మోసం చేస్తున్నారు. వైఎస్సార్ హయాంలో ఎవరికైనా కష్టం వస్తే తన బిడ్డకే వచ్చినట్లు పరిష్కారం చేసేవారు. కానీ, ఇప్పుడు వీఆర్ఏలు రాష్ట్రంలో 80 రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. వీఆర్ఏలు అసలు మనుషులే కాదన్నట్లు కేసీఆర్ చూస్తున్నాడు. ఇదేనా బంగారు తెలంగాణ? అని ప్రశ్నించారు షర్మిల. కేసీఆర్కి ఆయన కొడుకుకి, కూతురికి, అల్లుడికి.. పార్టీలో ఉండే ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు మాత్రమే బంగారు తెలంగాణ అయింది.
కళ్ళముందు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా కనిపిస్తున్నా భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. డిగ్రీలు, పీజీలు చదివిన వాళ్లు అల్లాడిపోతున్నారు. చివరికి ఆటో డ్రైవర్లుగా మిగిలిపోతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని, ఇంత అప్పు చేసినా దేనికి డబ్బు లేదు అంటున్నాడని ఆరోపణలు చేశారు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్ల పేరు చెప్పి మొత్తం దోచేశారన్నారు. 70 వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్లో తినేశాడు. ఆ సొమ్ముతో ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టాడని విమర్శించారు. కొత్తగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడంతో ఒక ఎమ్మెల్యే .. కోడి, మద్యం పంచాడు. మద్యం, కోడి పంచితే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అని అనుకోవాలి కదా? అని సెటైర్లు వేశారు వైఎస్ షర్మిల.