వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 90వ రోజుకు చేరింది. ప్రస్తుతం షర్మిల పాదయాత్ర ఖమ్మం జిల్లాలో ఫుల్ జోష్ తో కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన పాదయాత్రంతా ఒక లెక్కైతే.. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న యాత్ర మరోలెక్క అన్నట్టు.. యాత్ర జోరందుకుంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే, ఖమ్మం జిల్లాలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం యాత్రకు జనం నుంచి స్పందన లభిస్తోంది.
89వ రోజు వైరా మండలం ఖానాపురం గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన.. షర్మిల ట్రాక్టర్ నడుపుతూ కేడర్ లో ఉత్సాహం నింపిన షర్మిల.. మధిర నియోజకవర్గంలోకి ప్రవేశించింది. శుక్రవారం బోనకల్ మండలం రాపల్లి గ్రామంలో ప్రవేశించిన వైఎస్ షర్మిలకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతు కోరిక మేరకు షర్మిల నాగలి పట్టి దుక్కి దున్నారు. దీంతో పాటు ట్రాక్టర్ నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
కేవలం ఐదేళ్లలోనే ప్రజలకు నూటికి నూటిశాతం సంక్షేమ పాలన అందించిన ఏకైక సీఎం వైఎస్సార్ అని కొనియాడారు షర్మిల. వైఎస్సార్ తో ఏ సీఎం సాటి రారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీని గెలిపిస్తే.. మళ్లీ రైతు రాజ్యం ఏర్పడుతోందన్నారు. ఒక్క అవకాశం ఇస్తే.. వైఎస్సార్ సంక్షేమ రాజ్యాన్ని తీసుకొస్తామని మాటిస్తున్నానన్నారు.
అధికారంలోకి వస్తే రైతులు, పేదల సంక్షేమం కోసం కొత్త పథకాలను తీసుకొస్తామన్నారు షర్మిల. ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్ తన ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా ప్రజలపై భారం వేయలేదని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పాలన కావాలంటే వైఎస్ఆర్టీపీ అధికారంలోకి రావాలని షర్మిల పేర్కొన్నారు.