తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. 175వ రోజు ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ.3వేలకు తగ్గకుండా పింఛన్లు ఇస్తామని షర్మిల ప్రకటించారు.
సీఎం అంటే కేసీఆర్ లా మదమెక్కి ఉండకూడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి మనసున్న మారాజులా ఉండాలన్నారు. గత 78 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్నా కూడా కేసీఆర్ కు కనీసం కనికరం లేదన్నారు. అధికార మదం నెత్తికెక్కి వీఆర్ఏల వినతి పత్రాన్ని కేసీఆర్ విసిరికొట్టారని విమర్శించారు. అందుకే రాష్ట్రంలో అధికారం మారాల్సిన అవసరం ఉందన్నారు.
అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేపై కూడా షర్మిల విరుచుకుపడ్డారు. ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎమ్మెల్యే డబ్బుకు ఆశపడి మళ్లీ టీఆర్ఎస్ పార్టీకే పశువులా అమ్ముడుపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. అభివృద్ధి కోసమే జంప్ అవుతున్నా అని చెప్పి.. కనీసం సొంత గ్రామంలో పోడు భూములను ఫారెస్టు అధికారులు లాక్కుంటుంటే ఏమీ చేయలేకపోయారన్నారు.
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవకూడదనే కసితో చందాలు వేసుకొని మరీ ప్రజలు మరో పార్టీ నుంచి ఈ ఎమ్మెల్యేని గెలిపించారు. అయితే గెలిచాక అతడు ప్రజలను నమ్మకద్రోహం చేశాడనీ, వెన్నుపోటు పొడిచాడని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ టీపీ పార్టీ అధికారంలోకి వస్తే తమకున్న బాధలన్నీ తీరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు వైఎస్ షర్మిల.