టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్కు వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. పాదయాత్రలు చేసింది లేదు… ప్రజా సమస్యలు చూసింది లేదంటూ ఆమె ట్వీట్ లో అన్నారు. ఇచ్చిన హామీలను అమలును ఏనాడో విస్మరించారని పేర్కొన్నారు.
పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదంటూ ఎద్దేవా చేశారు. అంతకు ముందు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. షర్మిల వెనుక బీజేపీ ఉందని అర్థానిచ్చేలా ఆమె ట్వీట్ చేశారు. తాము వదిలిన బాణం తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు”అంటూ ఆమె ట్వీట్ చేశారు.
నర్సంపేటలో టీఆర్ఎస్ నేతల దాడి, పోలీసుల తీరుకు నిరసిస్తూ నిన్న ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టగా ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్ నేతలు ధ్వంసం చేసిన కారులోనే ఆమె ప్రగతి భవన్ వైపు వెళ్లారు. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.
కారులోంచి దిగేందుకు ఆమె నిరాకరించారు. దీంతో టోయింగ్ వాహనాన్ని తీసుకువచ్చి కారును ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. స్టేషన్ కు వెళ్లాక కారు డోర్లను బలవంతంగా ఓపెన్ చేసి షర్మిలతో పాటు ఆమె అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.