తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం బతికుంటే కేసీఆర్ ఆగడాలు సాగేవి కాదని ఆరోపించారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం ములుగు జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్ కు బీజేపీ, కాంగ్రెస్ లు అమ్ముడు పోయాయని విమర్శలు చేశారు షర్మిల.
మల్లంపల్లి గ్రామాన్ని మండలం చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఎనిమిదేళ్లైనా నెరవేర్చలేదని ఆమె మండిపడ్డారు. మల్లంపల్లిని ఎందుకు మండలంగా చేయలేదని షర్మిల ప్రశ్నించారు.
కేసీఆర్ కు పరిపాలన చేతకాదని.. ఎన్నికలు ఉన్నప్పుడే బయటకు వస్తారని ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. దొంగ హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం బతికుంటే కేసీఆర్ ఆగడాలు సాగేవి కావన్నారు.
కాళేశ్వరం పేరుతో 70 వేల కోట్ల అవినీతి చేసినా విపక్షాలు ప్రశ్నించలేదని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి పాలనను నిలదీయడానికే ఈ ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టానని పేర్కొన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్లీ వస్తుందని వెల్లడించారు వైఎస్ షర్మిల.