మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలంగా పోరాటం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షులు రేంవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మునుగోడు ఉప ఎన్నికలపై జూమ్ మీటింగ్ నిర్వహించి.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘‘మనం బూత్ లెవెల్ నాయకులను సిద్ధం చేసుకుంటే వారిని కూడా కొంటున్నారు. ఇప్పటి వరకు మనం అద్భుతంగా పని చేసాము. ఇక నుంచి మరింత అప్రమతంగా ఉండాలి. టీఆర్ఎస్, బీజేపీలు మరింత దిగజారి పోయి నాయకులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు.’’ అని వ్యాఖ్యానించారు.
ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వాళ్లు పూర్తి సమయం అక్కడే కేటాయించాలని, 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నియోజకవర్గంలో ఉంటు ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమాలకు వేం నరేందర్ రెడ్డి ప్రణాళిక సిద్దం చేస్తారని వివరించారు.
నవంబర్ 3 తర్వాత మునుగోడు ఎన్నికలలో పని చేసిన వారితో రాహుల్ గాంధీ జోడో యాత్రలో ప్రత్యేకంగా పాల్గొనే విదంగా ఏర్పాటు చేస్తున్నామని హామీ ఇచ్చారు. మునుగోడు ఎన్నికలు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమని ఎవ్వరు నిర్లక్షంగా ఉండవద్దని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంఛార్జ్ మనిక్కమ్ ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎన్నికల ఇంచార్జ్ ఆర్ దామోదర్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, నదీమ్ జావిద్ రోహిత్ చౌడరీ, షబ్బీర్ అలీ, మల్లు రవి, సంపత్ కుమార్, శంకర్ నాయక్, అనిల్ రెడ్డి, చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.